మెజీషియన్ చేతిలో హాండ్ మైక్ ఉంది. విద్యార్థులంతా ఆసక్తిగా ఆ రోజు మ్యాజిక్ కోసం ఎదురు చూస్తున్నారు. మెజీషియన్ మైక్ ను సరిచేసుకొని విద్యార్థులతో మాట్లాడటం ప్రారంభించాడు. 2015 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి 'అంతర్జాతీయ కాంతి, కాంతి ఆధారిత సాంకేతికాల సంవత్సరం'గా ప్రకటించిన సంగతి మీకందరికీ తెలుసు. అందుకే కాంతి మనోహరమైన ధర్మాల పట్ల మీకు ఆసక్తి కలిగించే మ్యాజిక్ లను మీకు చేసి చూపిస్తాను.” అన్నాడు. విద్యార్థులంతా "థ్యాంక్యు." అంటూ చప్పట్లు కొట్టారు.
మెజీషియన్ టేబుల్ ను వేదిక మీద నుంచి కిందికి దించి విద్యార్థులకు చాలా దగ్గరగా అమర్చాడు. ఒక ప్లాస్టిక్ కప్పును ఉంచి అందులో ఒక రూపాయి నాణెం ఉంచాడు. విద్యారర్థలంతా ఆసక్తిగా చూస్తున్నారు. మెజీషియన్ ఏడవ తరగతి విద్యార్థిని అశ్రీతను టేబుల్ కు దగ్గరగా రమ్మన్నాడు. నీకు కప్పులో నాణెం కన్పిస్తోందా అని అడిగాడు. కన్పిస్తోంది అని చెప్పింది అశ్రీత. మెజీషియన్ నాణేన్ని ముందుకు తోసి కప్పు అడుగు అంచుకు చేరేలా చేశాడు. అశ్రితా ఇప్పుడు నిల్చున్న చోటే ఉండి చూడు నాణెం కన్పిస్తోందా అని అడిగాడు. లేదు అని చెప్పింది అశ్రిత. కప్పు గోడలే నాణెం కన్పింకుండా మరుగుపరిచాయి. ఇప్పుడు మెజీషియన్ ఒక బాటిల్ లోంచి ఒక రంగులేని ద్రవాన్ని కొంచెం కొంచెం ప్లాస్టిక్ కప్పులోకి పోస్తూ అశ్రితను జాగ్రత్తగా గమనించమన్నాడు. నాణెం క్రమక్రమంగా కన్పించడం మొదలైంది. మరింతగా నీరు పోసిన తర్వాత నాణెం మొదట్లో ఉన్న చోటనే కొంచెం పైకి లేచినట్లు కన్పించింది. ఇప్పుడు నాకు నాణెం కన్పిస్తోంది అని ఆశ్చర్యంగా చెప్పింది అశ్రిత. ఇలా మళ్లీ మళ్లీ చేసి చాలా మందికి చూపించాడు మెజీషియన్. మీ సైన్సు టీచర్ నాకంటే బాగా దీని రహస్యాన్ని వివరించగలరన్నాడు మెజీషియన్.
ఇలా ఎందుకు జరిగింది? కనిపించకుండా పోయిన నాణెం నీరు పోసిన తర్వాత మళ్లీ ఎందుకు కన్పించింది? పిల్లలంతా సైన్స్ టీచర్ లక్ష్మిని చుట్టుముట్టి ప్రశ్నలు వేశారు. "చెబుతాను వినండి." అంటూ సైన్స్ టీచర్ పాఠాన్ని ప్రారంభించింది. దగ్గరగా జరిపి నప్పుడు గోడ అడల్డ్ రావడం వల్ల కనుమరుగయ్యింది. కాని కప్పులో నీరు పోసినప్పుడు మళ్లీ కనిపించింది. పైగా కొంచెం పైకి లేచినట్లు కన్పించింది కదా! ఇందుకు కారణం కాంతి వక్రీభవనం. నాణెం అది ఉన్నచోటు నుండి జరిగినట్లు అగుపించడం కప్పులో పోసిన నీటి ఎత్తు మీద ఆధారపడి ఉంటుంది.
కాంతి ఒక పారదర్శక యానకం నుంచి వేరొక పారదర్శక యానకంలోకి ప్రయాణించినప్పుడు దాని వేగం మార్చుకొని వంగుతుంది. దీన్నే కాంతి వక్రీభవనం అంటారు. ఇది ఎంతమేరకు జరుగుతుంది అనేది ఆ యానకం వక్రీభవన గుణకం మీద, రెండు యానకాలను వేరుచేసే తలానికి లంబరేఖతో కాంతి కిరణం చేసే కోణం మీద ఆధారపడి ఉంటుంది.
కప్పు ఖాళీగా ఉన్నప్పుడు అది గాలితో నిండి ఉంటుంది. గాలి కాంతిని వక్రీభవనం చెందించలేదు. కాని కప్పులో నీరు పోసినప్పుడు నాణెం నుంచి వచ్చే కాంతిని నీరు వక్రీభవనం చెందించింది అంటే వంగేలా చేసింది కాబట్టి ఆ కాంతి కంటికి చేరి నాణెం కన్పించింది.
ఈ మేజిక్ చాలా తేలిక. మనం చేసి చూద్దాం అంటూ తాను చేసి చూపించింది సైన్స్ టిచర్.
ఆధారం: ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 11/20/2023