మానవ జీవితంలో కాంతి, కాంతిపై ఆధారపడి అభివృద్ధి చెందిన సాంకేతికత చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కంటికి కనబడుట కాంతితో ముడిపడింది. మనం తినే ఆహారం అంతా కాంతి చర్య (కిరణజన్య సంయోగ క్రియ)తో తయారవుతోంది. మనం చూసే టి.వి. నుండి వాడే సెల్ ఫోన్ వరకు అంతా కాంతి మయం. ఇలా కాంతి మన జీవితాల్లో వెలుగు నింపుతోంది. కాబట్టి 2015 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి (UNO - యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్) "అంతర్జాతీయ కాంతి, కాంతి సాంకేతిక సంవత్సరం"గా ప్రకటించింది.
కాంతి గురించి మాట్లాడాలంటే, చెప్పాలంటే ఓ వ్యక్తి గురించి చెప్పకపోతే అది సంపూర్ణం కానే కాదు. అదేవరో తెలుసా... మరెవరో కాదు “సర్ ఐజాక్ న్యూటన్'. ఆ... అవును ఆపిల్ పండు క్రిందకు పడుతూ వుంటే చూసి 'గురుత్వాకర్షణ'ను కనుగొన్నాడే ఆయనే.. ఆయనే న్యూటన్. ఈ కాంతి ఏంటో దాని కథాకమామిషు ఏమిటో మనకు తెలియజేసిన వారిలో న్యూటన్ ముఖ్యులు. మరి ఆయన గురించి తెలుసుకుందామా!
న్యూటన్ క్రీ.శ. 1643 జనవరి 4న ఇంగ్లాండులో జన్మించాడు. న్యూటన్ బాల్యం కాస్త బాధాకరంగానే గడిచింది. పాఠశాల అన్నా దానిలోని పాఠాలన్న అయిష్టంగా వుండేది న్యూటన్ కు. పాఠశాలలో ఉపాధ్యాయులు న్యూటన్ ను వెనుకబడిన విద్యార్థిగా ముద్రవేశారు. ఎలాగో అలా పాఠశాల విద్య పూర్తి చేసి 18 ఏళ్ళ వయస్సులో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యకై ప్రవేశించాడు. అక్కడ గణితం, ఖగోళశాస్త్రం, భౌతికశాస్త్రం.. ప్రత్యేకించి కాంతిపై మక్కువ పెంచుకున్నాడు. కానీ అక్కడ కూడా పాఠశాలలోలాగే ఓ సాధారణ విద్యార్థిగా వుండేవాడు.
1665లో ప్లేగు వ్యాధి ప్రబలి యూనివర్శిటీని కొన్ని రోజుల పాటు మూసివేశారు. ఇక మన న్యూటన్ ఇంటికి చేరుకుని తనే స్వంతంగా చదువుకుంటూ ప్రయోగాలు చేసేవాడు. ఆయనకు అనేక సందేహాలు వచ్చేవి. నేల నీరుపై నూనె బిందువులు పడితే వివిధ రంగులలో ఎందుకు మెరుస్తుంది. ఇంధ్ర ధనస్సులో ఎందుకు రంగులు ఏర్పడుతాయి. ఇలా చాలా విషయాల గురించి తన నోట్ బుక్ లో వ్రాసుకునే వాడు. ఒక నాడు తన ఊరిలో జరిగే సంతకు వెళ్లాడు మన న్యూటన్. అక్కడ ఎండలో అద్భుతంగా తళతళమెరుస్తున్న ఓ జల్ పట్టకం (Prisms)లు న్యూటన్ దృష్టిని ఆకర్షించాయి. వెంటనే వాటిని కొని ఇంటికి తీసుకు వచ్చి ప్రయోగాలు మొదలు పెట్టేశాడు న్యూటన.
అలా ప్రయోగాలు చేస్తూ ఓ రోజు ఓ గదిలో తలుపులు, కిటికీలు మూసివేసి ఓ చిన్న రంధ్రం గుండా కాంతి వచ్చేలా అమర్చాడు. కాంతి మార్గంలో పట్టకం అమర్చి చూశాడు న్యూటన్. ఆశ్చర్యం! పట్టకం గుండా కాంతి ప్రయాణం చేసి బయటకు వెలువడినప్పుడు 7 మీటర్ల దూరం వున్న గోడపై 7 రంగుల కాంతిపుంజం. త్రిభుజాకారంలో ఏర్పడింది. ఈ రంగులు చూసి న్యూటన్ ఉత్సాహంతో పొంగిపోయాడు. ఈ పట్టకం కాంతికి రంగులు ఇస్తోందా? లేకపోతే కాంతే ఏడు రంగుల కలయికనా... పట్టకం గుండా పోతూ వుంటే రంగులుగా విడి పోతోందా? అని న్యూటన్ ఆలోచించడం మొదలు పెట్టాడు.
న్యూటన్ ఈ ప్రయోగాన్ని పదే పదే చేసి చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు... తెల్లని రంగు ఏడు రంగుల కలయిక అని. పట్టకం గుండా ప్రయాణిస్తుంటే 7 రంగులుగా విడిపోతుందని ప్రతిపాదించాడు. ఇంధ్రధనస్సులో కూడా ఇదే జరుగుతోందని గ్రహించాడు న్యూటన్. వర్షపు నీటి తుంపరల గుండా ఏటవాలుగా కాంతి ప్రయాణిస్తుంటే కాంతి ఏడు రంగులుగా విడిపోయి ఇంధ్రధనస్సు ఏర్పడుతోందని న్యూటన్ నిరూపించాడు. ఇంధ్రధనస్సు (Rainbow) గురించి వివరించిన మొట్టమొదటి శాస్త్రవేత్తగా మన న్యూటన్ నిలిచిపోయాడు.
ఈ ప్రయోగాల ద్వారా న్యూటన్ మరొక విషయం కనుగొన్నాడు. అదేమిటంటే ఏ వస్తువైనా కాంతిలోని ఏ రంగునైతే గ్రహించదో (శోషించుకోలేదో) ఆ రంగులో కనిపిస్తుందన్నమాట. అంటే పచ్చిగడ్డి ఆకుపచ్చగా ఎందుకు కనిపిస్తోంది అంటే పచ్చిగడ్డి ఆకుపచ్చరంగును గ్రహించలేదు. (శోషించుకోలేదు). అందువల్ల ఆకుపచ్చగా కనిపిస్తుందన్న మాట. ఈ విషయాలతో 1704లో 'ద ఆప్టిక్స్' అని ఓ పుస్తకం ప్రచురించాడు న్యూటన్.
ఇలా కాంతిపై అనేక ప్రయోగాలు చేశాడు న్యూటన్. కాంతి కణరూపంలో ప్రయాణిస్తుందని... వివిధ రంగులు వివిధ తరంగదైర్ఫ్యం గల కణాల వల్ల ఏర్పడుతుందని ప్రతిపాదించాడు. దీనినే న్యూటన్, కార్పస్కులార్ థియరీ అంటారు. కాంతి గురించి ఇంతగా ప్రయోగాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి న్యూటన్. అలాంటి న్యూటన్ ను 2015 కాంతి, కాంతి సాంకేతిక సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా దృశాశాస్త్ర (Optics) పితామహుడిగా పిలవడం ఎంతైనా సమంజసం.
న్యూటన్ 1679లో వర్ణచక్రాన్ని (కలర్ వీల్ ను), 1668లో పరావర్తన టెలిస్కోప్ (Reffective)ను కనిపెట్టారు.
1678న న్యూటన్ అతిముఖ్యమైన 3 గమన నియమాలు (Newton laws)ను ప్రతిపాదించాడు.
న్యూటన్ 'కాలికులస్' అనే గణితశాస్త్ర విభాగాన్ని కనిపెట్టారు.
ఆధారం: యుగంధర్ బాబు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/22/2020