కొత్త కోడలు ఉల్లిపాయలు తరుగుతూ కళ్లనీళ్లు పెట్టుకుంది. ఆమె పని చేయలేక ఏడుస్తున్నదని అత్తగారికి అనిపించింది. అందేం లేదు ఉల్లి వల్ల కళ్లనీళ్లని కోడలు అంటుంది. మొత్తానికి ఉల్లిపాయలు తరిగితే కళ్ల వెంట నీరు గారడం మాత్రం తప్పదని అనుభవపూర్వకంగా అందరికీ తెలిసే ఉంటుంది. ముఖానికి తడిగుడ్డ అడ్డుపెట్టుకోవాలని కత్తికి చమురు పూయాలని, మరేదో చేయాలని, విరుగుడుగా లక్ష చిట్కాలు చెప్పినా ఉల్లి ఏడ్పించనిదే ఊరుకునే రకం కాదు. చివరకు దానికి సమాధానం చెప్పగలిగిన వారు పరిశోధకులు మాత్రమైనని తేలింది. ఈ మధ్యన వచ్చిన ఒక పరిశోధన ఫలితం ఆధారంగా ముందుకు సాగితే త్వరలో ఏడుపు అవసరం లేకుండానే తాజా ఉల్లిని కోయగలిగే రోజులు రావచ్చు. అందుకు జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రమేయం అవసరమవుతుంది.
ఆనియన్ లో కళ్లనీటికి కారణమయే ఎంజైమును జపాన్ పరిశోధకులు గుర్తించారు. ఈ రసాయనం కళ్లలో ఉండే లాక్రిమల్ డక్ట్ ను తగిలి మంట పుట్టిస్తుంది. కారణంగా కన్నీళ్లు కారుతాయి.
ఏడుపుగాని ఏడుపుకు కారణమయ్యే రసాయనం పేరు ప్రొపాంతిమాల్ ఎస్ ఆక్సైడ్. లాక్రిమేటరీ ఫ్యాక్టర్ సింతటేజ్ అనే ఎంజైమ్ కారణంగా ఈ రసాయనం తయారవుతుందని జపాన్ లోని హౌస్ ఫుడ్స్ కార్బోరేషన్ పరిశోధకులు ఫిన్ సుకే ఇమాయి కనుగొన్నారు కొంత పాతరకం జీవరసాయనశాస్త్రం, మరికొంత సరికొత్త జీవసాంకేతిక శాస్త్రం జోడించి వారు ఈ ఫలితాలను పొందగలిగారు.
ఇంతకు ముందు జరిగిన పరిశోధనలతో ఉల్లిపాయల వాసనకు కారణమయిన రసాయనాలే ఘాటు పుట్టిస్తాయని సూచనలందాయి. కోసినపుడు ఆ రసాయనాలు ఆలినేస్ అనే ఎంజైమ్ తో కలిసి కన్నీళ్లకు కారణమవుతాయని అనుకున్నారు. అంటే ఏడిపించని ఉల్లిపాయలను తయారుచేయడానికి పూనుకుంటే, దాని వాసనకూడా పోతుందని అర్థం. వాసన లేకుంటే ఉల్లిరుచి సగం తగ్గుతుందని వేరుగా చెప్పనవసరం లేదు. అందుకే ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. సరికొత్త ఫలితాలు మాత్రం ఈ విషయాన్ని మరోదానికి మలుపుతున్నాయి.
రసాయనచర్య చివరకు ప్రొపాంటిమాల్ ఎస్ అక్సైడ్ నే తయారు చేస్తున్నది. కానీ మధ్యలో స్టెప్స్ మాత్రం వేరుగా ఉన్నాయి. వాసనకు కారణమయిన రసాయనాలకు ఈ కార్యక్రమంలో భాగం లేనేలేదు. అంటే ఈ సారి మళ్లీ ప్రయత్నించి రుచి చెడకుండానే, ఏడుపు లేని ఉల్లిపాయలను తయారు చేయగల వీలు చిక్కిందని జెనెటిక్ ఇంజనీరింగ్ రంగంలోని వారు అంటున్నారు.
ఏడుపు రసాయనం తయారీకి కారణమయిన ఒకే ఒక రసాయనం గురించి తెలిసి పోయింది. కనుక జన్యు సాంకేతిక పద్ధతులను వాడుకుని ఈ ఎంజైమ్ రసాయనం లేని ఉల్లి పంటను పండించవచ్చు. ఎంజైమ్ ఉండి తీరాలనుకుంటే, దాని పనితీరును అణదొక్కవచ్చు. లేదా మార్చవచ్చు. విశ్లేషణ తమ వంతయితే, ఇక తర్వాత పని జెనెటిక్స్ రంగంలో వారిదంటూ ఇమాయి సంతోషంగా తెలియజేరారు.
జన్యుపరంగా మార్చిన తిండి పదార్థాలను, పంటలను ప్రపంచం అంగీకరించడం లేదనేది అందరికీ తెలిసిన నిజం ఉల్లిపాయలు కొంచెం కన్నీళ్లు కార్పించినంత మాత్రాన పనికిరాకుండా పోయిన దాఖలాలూ కనిపించడం లేదు. ఏడుస్తూనే అందరూ వాటిని ఆనందంగా తింటున్నారు. అయినా జెనెటికల్లీ మ్యానిపులేటేడ్ ఆనియెన్స్ వస్తే అందరూ సులభంగా ఆదరించ గలుగుతారని ఒక నమ్మకం ఉంది. సాధారణంగా జి.ఎమ్. ఆహారంలోకి కొత్త జన్యువులను ప్రవేశపెడుతున్నారు. ఉల్లిపాయ విషయంలో ఉన్నదాన్ని తీసివేయాల్సి ఉంటుంది. అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. మొత్తం మీద పంట పండించిన వారికన్నా, ఇందులో ఎక్కువ లాభం పొందేవారు కూడా వాడకం దార్లే అవుతారని మరో నమ్మకం.
రచయిత: కె.బి.గోపాలం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/6/2022